ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరో మహమ్మారి తప్పక వస్తుందని గంభీర హెచ్చరిక జారీ చేసింది. కోవిడ్-19 సమయంలో ప్రపంచం ఎదుర్కొన్న ప్రాణ నష్టం, ఆర్థిక దిగ్భ్రాంతిని గుర్తు చేస్తూ, ఈసారి మరింత తీవ్రమైన ముప్పును ఎదుర్కొనాల్సి రావొచ్చని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘ్యాబ్రియేసస్ అన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని, సమిష్టిగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
జెనీవాలో నిర్వహించిన డబ్ల్యూహెచ్ఓ పాండమిక్ అగ్రిమెంట్ సమావేశంలో టెడ్రోస్ మాట్లాడుతూ, ఇది సిద్ధాంత పరమైన ఆందోళన కాదని, ఎపిడెమియోలాజికల్ (సాందర్భిక శాస్త్ర సంబంధిత) పరంగా ఇది ఖచ్చితమైన ప్రమాదమని స్పష్టం చేశారు. “మరో మహమ్మారి రావడం అనివార్యం. అది వచ్చే వారం కూడా రావొచ్చు, 20 ఏళ్ల తర్వాతా రావొచ్చు. కానీ తప్పదు. అందుకే ప్రపంచం సిద్ధంగా ఉండాలి,” అంటూ ఆయన హెచ్చరించారు.
కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, వాస్తవంగా ఆ సంఖ్య 2 కోట్లకు పైగా ఉండొచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ మహమ్మారి కారణంగా 10 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 1918లో వచ్చిన ఫ్లూ మహమ్మారి 50 మిలియన్ల మంది ప్రాణాలు తీసిందని, ఇప్పుడూ అటువంటి తీవ్రత కలిగిన ప్రమాదం మళ్లీ రావచ్చని అన్నారు.
మహమ్మారులపై సమిష్టిగా పోరాడేందుకు సభ్యదేశాల మధ్య పాండమిక్ ఒప్పందంపై ఏకాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఏ దేశపు సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయదని, దేశీయ చట్టాలను గౌరవిస్తూ అంతర్జాతీయ సహకారాన్ని బలపరుస్తుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమన్వయం, సహకారం ఉంటే రాబోయే ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని టెడ్రోస్ తెలిపారు.
Also Read : Ajwain in Telugu: వాముతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?














