తొమ్మిదవ సారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం దీనితో బిజెపికి బెనిఫిట్ ఏంటి ?

ఊహించినట్టే- అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి జనతాళ్ (యునైటెడ్) బయటికి వచ్చింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరింది. జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు.
ఈ ఉదయం గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం అక్కడి పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ ఉదయం జేడీయూ శాసనసభా పక్ష సమావేశం కొనసాగుతున్న సమయంలోనే అటు భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా భేటీ అయ్యారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. జేడీయూతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏకవాక్యా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సామ్రాట్ చౌదరి. దీని మీదా ఏకాభిప్రాయం కుదిరింది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా దీనికి తమ ఆమోదం తెలిపారు.
దీనితో బిహార్లో జేడీయూ- బీజేపీ- హిందుస్తాన్ ఆవామీ లీగ్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమైంది. ఈ తీర్మానానికి అనుగుణంగా రూపొందించిన లేఖపై బీజేపీ సభ్యులందరూ సంతకాలు చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలో జేడీయూ- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ అంగీకారం తెలిపారు.
ఈ లేఖను తీసుకుని గవర్నర్ను కలిశారు. ఆయన వెంట వినోద్ తావ్డే, దినేష్ కుమార్ సింగ్, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, హిందుస్తానీ ఆవామీ లీగ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. గవర్నర్ అర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతోండటం ఇది తొమ్మిదోసారి.
ఆయనతో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా.. ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటు బీజేపీ- హిందుస్తాన్ ఆవామీ లీగ్కు చెందిన ఆరుమంది శాసన సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బిహార్లో ప్రభుత్వ మార్పిడి చోటు చేసుకుందనేది బహిరంగ రహస్యమే. మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా.. బీజేపీ మెజారిటీ సీట్లను ఆశిస్తోంది. ప్రస్తుతం బీజేపీ, జేడీయూ 17 చొప్పున స్థానాలను గెలుచుకున్నాయి. ఆరుచోట్ల లోక్ జన్శక్తి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే దూకుడును ప్రదర్శించాలని బీజేపీ భావిస్తోంది.
మరిన్ని వార్తలు :