Vijaya Sai Reddy Nominate For Rajyasabha: సాయిరెడ్డికి బీజేపీ బిగ్ ఆఫర్..! రాజ్యసభలోకి రీ-ఎంట్రీనా..? చంద్రబాబు అభ్యంతరంపై ఆసక్తికర చర్చలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా ఉన్నా, బీజేపీ తన వ్యూహాలను మారుస్తూ, సొంతంగా బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు జాతీయ స్థాయిలో కీలక నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో, వైసీపీ నుంచి విరమించిన విజయసాయిరెడ్డికి బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చిందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీలో కీలక నేతగా, జగన్ కోటరీకి నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తనకు ఇక రాజకీయాలపై ఆసక్తి లేదని, వ్యవసాయం చేస్తానని ప్రకటించారు. అయితే, ఆయన రాజీనామా సమయంలోనే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని ప్రచారం జరిగింది. తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు బీజేపీలోకి ఆయన ఎంట్రీ ఖరారైందన్న సంకేతాలు డిల్లీ వర్గాల నుంచి వస్తున్నాయి.
వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి ఆయనే బీజేపీ తరపున భర్తీ చేయనున్నారని చెబుతున్నారు. ఇందుకోసం కూటమి స్దాయిలో ఇప్పటికే సూత్రీకరణ జరిగినట్లు సమాచారం. ఇదే విధంగా గతంలో ఆర్.క్రిష్ణయ్య బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైనట్లే, ఇప్పుడు సాయిరెడ్డికి కూడా అదే ఫార్ములా వర్తించనుంది.
అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో వైసీపీలో నెంబర్ టూగా ఉన్న సాయిరెడ్డి తమ పార్టీకి తీవ్ర ఇబ్బందులు కలిగించారని గుర్తుచేసి, ఆయన బీజేపీలో చేరడం మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తూ సాయిరెడ్డి ముందుగా రాజీనామా చేసి, కొంతకాలం గ్యాప్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సమయంలో బీజేపీ విజయసాయిరెడ్డికి తిరిగి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. దీనితో, ఆయన రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి బీజేపీ తరపున రాజ్యసభకు వెళతారా, లేక రాజకీయాలకు దూరంగా ఉంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా, ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో నూతన మలుపు తీయడం ఖాయం.