ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం – ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.1.5 లక్షల వరకూ రాయితీ..! ఎవరికీ లభిస్తుంది?

Ap government bc loan subsidy ceiling removed : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇచ్చే రాయితీ రుణాలపై కీలకంగా మార్పులు చేసింది. స్వయం ఉపాధి కోసం ఇచ్చే యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. గతంలో ఈ రాయితీపై ఉన్న గరిష్ట పరిమితిని తొలగించారు. ఇకపై యూనిట్ విలువ పెరిగితే, రాయితీ మొత్తం కూడా అదే మేరకు పెరుగుతుంది.
ఇందులో భాగంగా రూ.2 లక్షల యూనిట్ అయితే రూ.లక్ష, రూ.3 లక్షల యూనిట్ అయితే రూ.1.5 లక్షల వరకు రాయితీ లభించనుంది. ఇంతకు ముందు రూ.75 వేలు గరిష్టంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిమితిని రద్దు చేసి, పూర్తి 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను బీసీ సంక్షేమ శాఖ ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం రూ.890 కోట్ల బడ్జెట్ కేటాయించి, దాదాపు 40,000 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటంతో, లబ్ధిదారుల ఎంపిక అధికారులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలుగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్తలు ప్రకారం, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా కూడా 1.62 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. దీంతో యూనిట్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్ ఎమ్మెల్యేలు ద్వారా బీసీ సంక్షేమ శాఖపై పెరిగింది.
ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిర్వహించిన జ్యోతిబా ఫులే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 7,000 బీసీ లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు.