బి ఆర్ ఎస్ కు షాక్ : కాంగ్రెస్ గూటికి హుజూర్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా పార్టీలు మారుతున్న నేతల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్నారు. తాజాగా ఇద్దరు భారత రాష్ట్ర సమితి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరొకరు ఏ పార్టీలో చేరాలా అనే దానిపై ఆలోచన జరుగుతున్నారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చైర్పర్సన్ అర్చనతో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు కూడా గాయత్రీ, గంగాభవాని, అమరబోయిన సతీష్ కూడా భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

హుజూర్నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన నివాసంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తంకుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని, వారి రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉత్తంకుమార్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.