అంగన్వాడీ కార్యకర్తలకు శుభవార్త: వేతనం రూ.11,500 కి పెంపు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ హోదాకు అప్గ్రేడ్ చేయాలని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఆమోదం లభించింది. తొలి విడతగా 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ హోదా పొందనున్నాయి.
ఈ నిర్ణయంతో 4,687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ పొందనున్నారు. వారు పొందుతున్న గౌరవ వేతనం రూ.7,000 నుంచి రూ.11,500 కి పెరగనుంది. ఇది ఒకింత ఊరట కలిగించే అంశంగా అంగన్వాడీ ఉద్యోగులు భావిస్తున్నారు.
అలాగే, ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న మినీ అంగన్వాడీ కార్యకర్తల స్థానాల్లో కొత్త అంగన్వాడీ సహాయకుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా మరింత ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. వారంతా తమ ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీ కేంద్రాల ఉన్నతీకరణ అమలు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఇంకా వచ్చే వారం రోజుల్లోనే సంబంధిత ఉత్తర్వులు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ప్రజానేకంగా ముందుకు సాగుతోంది.