నల్ల బర్లీ పొగాకు రైతులకు ఊరట – రూ.273 కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నల్ల బర్లీ పొగాకు రైతులకు భారీ ఊరటను కలిగించింది. మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్నా, రైతుల అభ్యున్నతి కోసం ముందడుగు వేసిన ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.273 కోట్లు నేరుగా జమ చేసింది.
ఈ మొత్తాన్ని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పొగాకు పంటకు సంబంధించిన రైతులకు జమ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రులతో సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు – “వాణిజ్య పంటలకు డిమాండ్ తగ్గినా రైతులకు నష్టమవకూడదు. రైతులను ప్రోత్సహిస్తూ మారుతున్న మార్కెట్ అవసరాలను బట్టి తగిన విధంగా పంటలు సాగు చేసేలా చైతన్యపరచాలి” అని సూచించారు.
పొగాకు రైతులకు ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వ సంకల్ప బలానికి నిదర్శనమని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మార్కెట్లో నష్టపోతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ చొరవను ప్రశంసిస్తున్నారు.