ఆర్మీ కుటుంబాలకు బంపర్ ఆఫర్ – ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశ రక్షణ కోసం జీవితాలను అంకితమిస్తున్న సైనిక కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో, పంచాయతీ పరిధిలో ఉన్న రక్షణ సిబ్బంది ఇళ్లకు ఇకపై ఆస్తి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ మినహాయింపు మాజీ సైనికులు, ప్రస్తుతం సేవలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సిబ్బంది మరియు వారి జీవిత భాగస్వాముల పేర్లపై ఉన్న ఇళ్లకు వర్తించనుంది. ఇది కేవలం ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు నివసిస్తూ ఉంటేనే వర్తిస్తుంది. అద్దెకు ఇచ్చిన ఇళ్లకు ఇది వర్తించదు.
ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో ‘ఆర్మీ’ సిబ్బందికే ఈ మినహాయింపు వర్తించేది. తాజా నిర్ణయంతో ‘డిఫెన్స్ సిబ్బంది’ అనే పదాన్ని చేర్చడం ద్వారా మరింత విస్తృతంగా ఈ లబ్ధి అందించనున్నారు.
ప్రభుత్వం సవరిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వుల ప్రకారం – ఒక ఇంటి మీద ఒకే డోర్ నంబర్ ఉంటే, ఎంతమంది నివసించినా ఆ ఇంటికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కానీ భార్య భర్తల పేర్లపై రెండు ఇళ్లు ఉంటే, కేవలం ఒక ఇంటికే మినహాయింపు ఉంటుంది.
మరోవైపు, ఒక పంచాయతీలో 10% కంటే ఎక్కువ ఇళ్లు రక్షణ సిబ్బందికి చెందినవిగా ఉంటే, ఆస్తి పన్నులో 50% మినహాయింపు మాత్రమే ఇస్తారు. అదే 10% కంటే తక్కువ ఉంటే, పూర్తిగా 100% మినహాయింపు వర్తిస్తుంది.
ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లోని సైనికులు, మాజీ సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ సేవలను గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఇంతలో, దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా ఫోన్ చేసి పరామర్శించారు. “మురళీ త్యాగం దేశం అంతటా గుర్తుంచుకుంటుంది. మీకు ఏవిధంగా సహాయపడాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉంది,” అని భరోసా ఇచ్చారు.
Also Read : AP Ration Cards : APలో స్మార్ట్ రేషన్ కార్డుల జారీపై పూర్తి వివరాలు