ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ సహాయం.. వేతనాలు అకౌంట్లలో

ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మంచి వార్తను అందించింది. రాష్ట్రానికి రూ.961.46 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిల కింద విడుదల చేయడం జరిగింది. ఈ సొమ్ము సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కూలీల ఖాతాల్లో జమ కానుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ చేసిన విజ్ఞప్తికి స్పందనగా కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. త్వరలో మెటీరియల్ నిధులు కూడా విడుదలవుతాయని అధికారులు తెలిపారు.
ఉపాధి హామీ కూలీలకు డబ్బులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ఫిబ్రవరి నుండి బకాయిలుగా ఉన్న వేతనాల చెల్లింపుగా జమ కానున్నాయి. గత కొన్ని వారాలుగా కూలీలు వేతనాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వారికి ఊరట కలిగించింది.
కమిషనర్ కృష్ణతేజ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి కూలీల పరిస్థితిని వివరించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు మరో వారం రోజుల్లో మెటీరియల్ నిధులు కూడా అందనున్నాయని వెల్లడించారు. దీంతో సిమెంట్ రోడ్లు, మినీ గోకులాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు జరగనున్నాయి.
అసలే ప్రతి వారం చేసిన పనికి వేతనాలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక సంవత్సరం చివర్లో సాధారణంగా నిధుల జాప్యం కారణంగా వేతనాలు ఆలస్యం కావడం జరుగుతుంది. ఈసారి కూడా 12 వారాలుగా చెల్లింపులు జరగకపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించి, నిధుల విడుదలకు దోహదపడింది. తాజాగా విడుదలైన నిధులతో కూలీలకు ఆనందం కలిగింది.
ఏపీలో క్రీడాకారులకు ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహం
ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు తీపికబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్ను మూడు శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని విభాగాలూ ఆయా మార్పులను అమలు చేయాలని సీఎస్ కె. విజయానంద్ సూచించారు. రోస్టర్ పాయింట్లను సవరించుకోవాలనీ, ప్రభుత్వ శాఖలు, సంస్థలు, సొసైటీలు ఈ మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేశారు.
Also Read : ఏపీలో మరో 30 నామినేటెడ్ పదవులు: కూటమి ప్రభుత్వం తాజా నియామకాలు వెలుగులోకి!
One thought on “ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీ సహాయం.. వేతనాలు అకౌంట్లలో”