Telangana Jobs: తెలంగాణలో భారీ ఉద్యోగ అవకాశాలు.. వరంగల్ టెక్స్టైల్ పార్క్లో 25,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రసుత్తం ట్రయల్ రన్ దశలో ఉన్న కిటెక్స్ గార్మెంట్స్ కంపెనీ, వివిధ విభాగాల్లో మొత్తం 25,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఉద్యోగాల్లో వైస్ ప్రెసిడెంట్లు, మేనేజర్లు, ఇంజినీర్లు, సూపర్వైజర్లు తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు కంపెనీ అధికార వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సంస్థ తెలిపింది.
వరంగల్లో టెక్స్టైల్ పార్క్కు పెరుగుతున్న ఆదరణ
వరంగల్లో త్వరలో విమానాశ్రయం ప్రారంభం కానుంది. దీని వల్ల రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. ఇది టెక్స్టైల్ పార్కులో పెట్టుబడుల పెట్టేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “పీఎం మిత్ర” పథకంలో ఈ పార్కును చేర్చే అవకాశమూ ఉంది. దీంతో మరిన్ని దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులకు ముందుకు రావొచ్చు.
2017లో ఈ పార్క్ ప్రారంభమైన సమయంలో 22 కంపెనీలు రూ.3,900 కోట్ల పెట్టుబడి పెట్టే ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం మూడే కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిలో ముఖ్యమైనది కిటెక్స్, ఇది రూ.1,200 కోట్ల పెట్టుబడితో పిల్లల దుస్తుల తయారీ యూనిట్ను ప్రారంభించింది. అదేవిధంగా గణేశా ఎకో పెట్, ఎకోటెక్ కంపెనీలు కూడా చిన్న యూనిట్లతో కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
ప్రభుత్వం చర్యలు
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పార్క్ను సందర్శించి, అక్కడి సమస్యలను పరిశీలించారు. దక్షిణ కొరియాలో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ఈ చర్యలతో విదేశీ కంపెనీలు పార్క్ను సందర్శించాయి. అయితే రవాణా సౌకర్యాలపై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ త్వరలో ప్రారంభమయ్యే విమానాశ్రయం ఈ సమస్యను పరిష్కరిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
భవిష్యత్ అవకాశాలు
ఇప్పటికే మరో రెండు కంపెనీలు టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేగాక, ఈ నెల 18న జపాన్లో జరిగే బిజినెస్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ పార్క్ను ప్రమోట్ చేయనుంది. రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో పాటు, పెట్టుబడులు పెరిగితే మరిన్ని ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.