మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ – లక్ష మందికి పైగా మహిళలతో సమావేశం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని నవ్సారీ జిల్లా వంసి-బోర్సిలో నిర్వహించనున్న ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో 1.1 లక్షలకుపైగా మహిళలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కనీసం రెండు కోట్ల మంది మహిళలను ఆర్థికంగా స్వావలంబన కలిగినవారిగా తీర్చిదిద్దే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. (international womens day pm modi lakhpati didi empower 2 crore women)
ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్థిరపడే అవకాశాన్ని పొందుతారు. మహిళలు స్వతంత్రంగా సంపాదించి, అభివృద్ధిలో భాగస్వామ్యులవ్వడమే ‘లఖ్పతి దీదీ’ పథక ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా వారికి మరింత ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి కృషి చేస్తోంది.
ఈ కార్యక్రమ నిర్వహణ పూర్తిగా మహిళా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతోంది. మొత్తం 2,165 మంది మహిళా కానిస్టేబుళ్లు, 187 మంది మహిళా ఇన్స్పెక్టర్లు, 61 మంది పిఎస్ఐలు, 19 మంది డిప్యూటీ ఎస్పిలు, 5 మంది డీఎస్పిలు, ఒకరు ఐజిపి, మరో ఒకరు ఎడిజిపి స్థాయిలో ఉన్న మహిళా అధికారులు ఈ భారీ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించనున్నారు.
ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను గౌరవించడం, లింగ సమానత్వంపై అవగాహన పెంచడం, మహిళా సాధికారతపై చర్చించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ దినోత్సవం మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను ప్రోత్సహించేందుకు ఒక వేదికగా నిలుస్తుంది.
మహిళా అభివృద్ధి మాత్రమే కాకుండా, మహిళల నేతృత్వంలోని సమగ్ర అభివృద్ధి వైపు భారత ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మహిళలను సామాజిక, ఆర్థిక పురోగతికి కేంద్రబిందువుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో, మార్చి 8న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో “మహిళా శక్తితో అభివృద్ధి చెందిన భారతదేశం” అనే థీమ్తో జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనుండగా, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి, సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, ఇతర ప్రముఖుల సమక్షంలో కీలక చర్చలు జరగనున్నాయి. యునిసెఫ్, యుఎన్ ఉమెన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో పాటు, సాయుధ దళాలు, పోలీస్ శాఖ, ఇతర రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
జాతీయ స్థాయిలో మహిళల పాత్రను గౌరవిస్తూ #SheBuildsBharat అనే ప్రత్యేక ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల హక్కుల పరిరక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం.
Also Read : తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు